Sunday, September 19, 2010

నేను స్వామిజి ఎందుకు కాకూడదు?

నిన్న మినియాపోలిస్ లో  ఒక టెంపుల్ కి వెళ్ళాను, అక్కడ ఒక ప్రఖ్యాత  స్వామిజి  వస్తున్నారని అరగంట ముందునుంచి హడావిడి మొదలు.  టెంపుల్ కమిటీ మెంబర్స్ మొఖంలో ఒక సరదా, ఉత్సాహం , బిజీగ ఉన్నట్టు బాడీ లాంగ్వేజ్.  సీనియర్ కమిటీ మెంబర్ ని జూనియర్ అడుగుతున్నాడు , "వచ్చారా ..? ఇప్పు డు ఎక్కడున్నారు"?,  "హ వస్తున్నారు .. ఇంకో పది నిముశలలలో  వస్తున్నారంట",  వీళ్ళ హడావిడి చూసే గుడిలో మిగిలిన భక్తులకు కొంచెం టెన్షన్ పెరిగింది, నాకు కూడా!

గుడికి కొన్ని కార్లు రావడం, వచ్చిన కార్ల వంక చూసి కమిటి పెద్దలు, అబ్బే.. స్వామిజి  ఈ కార్లలో లో రారు అని తేల్చేసారు. తర్వాత వాళ్ళే , " ఆయన టొయోట లో రారు,  BMW లో వస్తారంట" అనుకొంటున్నారు. నాలాంటి మిగత భక్తుల మొఖంలో కొంచెం గర్వం తొంగి చూసింది. నిజమే ఇంత దూరం , ఇంత ఖర్చుపెట్టు కొని , స్వామిజి చూద్దాం అని వచ్చిన తర్వాత , తీర ఆయన డొక్కు కార్లో దిగితే మన భక్త హృదయం తట్టుకోగలద?  అలాంటి గొప్పవాళ్ళు మనల  హోండా లోనో టొయోట లోనో రారు , వాళ్ళకు తగ్గ కార్లు వాళ్ళకు ఉండాలిసిందే. 

ఇంతలో గుడిలో ఒక్కసారిగా హడావిడి, స్వామి వచ్చారంటే వచ్చారు అని.   ఇంతలో చిరు నవ్వులు  చిందిస్తూ , శిష్య పరమాణువు నడిపిన  BMW కారులోనుండి, భక్త కోటిని, కారులోనుంచే  ఆశ్వేరదిస్తూ  స్వామిజి .  ఒక డ్రెస్ కోడ్ లాగా , కాషాయ వస్త్రం, మొఖాన వీభూధీ ,  మెడలో రుద్రాక్ష మాలలు , చేతికి కడియం, వేళ్ళకు పచ్చ, పుష్యరాగం లాంటి ఉంగరాలు , మొఖాన రూపాయి కాసంత కుంకం బొట్టు.  ఎంత మంది  ఇలా  చూడలేదు స్వామి అనే నా మనసు నోరు నొక్కి , నేను జనంలో కలిసిపోయాను.

పూజ అర్చన ఐన తర్వాత స్వామి ఉపదేశం ఇవ్వాలి. భక్తులు అందరు రెండు చేతులతో నమస్కారం చేస్తూ, స్వామి ఏమి చెబుతారా అని ఎదురు చూస్తున్నారు.  నేను కూడా జనం లో ఒక మూల కూర్చొన్నాను. నమస్కారం మాత్రం చెయ్యొద్దని నా మనసుకు చెప్పాను.  స్వామి ఒక్క సైగ చేసారు.  కొంచెం వంగితే అందే మైకు ని , మరో భక్తుడు ఆయన నోటిదగ్గర పెట్టాడు.  ఇంకో సైగతో , గాలి కంట్రోల్ చెయ్యబడింది.  స్వామిని నిశితంగా పరిశీలించిన మనసు ఇంకో ప్రశ్న అడిగింది, ఎందుకు స్వామికి పొట్ట వచ్చింది అని?  దీని అసాధ్యం కూల , కొంచెం మనసు మూసుకూర్చోరాదు?  నీకెందుకే స్వామికి పొట్ట ఉంటే, లేక పొతే? నా సమాధానం తో  అది తృప్తి పొందలేదు.  అదికాదు అన్న , స్వామి అంటే  భగవంతునికి ఎంతో చేరువతో ఉండి, ఖటిన ఉపవాసాలతో, శరీరంపైన నియంత్రణ కలిగి ఉంటారు , కాదా ? మరి పొట్ట వస్తే అర్ధం ఏమిటి? బాగా కొవ్వు పదార్ధాలు తింటున్నట్టు కదా?  నాకు సమాధానం తెలీదు, మనసుని మళ్ళి నోరు మూసుకోమన్నాను.  ఇంతలో స్వామి ఇంకో పది మందికి గాల్లో నే ఆస్వేరదించారు.  నిజమే ఆశ్వీర్వాదం గాల్లో నే కదా చేస్తారు? కాదురా, తల మీద చెయ్యి పెట్టి కూడా చెయ్యొచ్చు, అది కూడా తెలీద , నా మనసు మందలింపు.

స్వామి ప్రసంగం మొదలైంది,  వెంకటేశ్వర స్వామి గూర్చి చెప్పారు. వెన్ అంటే పాపం అని , కట అంటే తొలిగించే వాడని చెప్పారు. ఈ విషయం నాకు తెలుసు.  చాల మందికి కూడా.  ఇక తిరుమల గురించి,  మన శరీరంలో ఉండే ఏడు కొండలగురించి, మన శరీరమే తిరుమల అని , ఇలా చెప్పుకొంటూ పోయారు.  మనసే దేవాలయం అనే పాట పాడి  భక్తులను రంజింప చేసారు. ఆ యన చేబుతున్నంత సేపు నా పక్కనున్న మహా భక్తుడు , ఒక్కటే దండాలు. ఆహ, ఓహో అంటూ తన్మయత్వం. ఎవరి ఆనందం వారిది. 

పాట పడడం అయిపోయింది.  ఇక అప్పుడు ప్రారంభమైంది , ఆశ్వీర్వాద కార్యక్రమం.  పొలో మని, ఆశ్వీర్వాదం తీసుకోడానికి లైను లో నుంచున్నారు భక్త వందలు (వంద మంది ఉంటారేమో)  ఒకరి తర్వాత ఒకరు, కాళ్ళ మీద పడి పోతున్నారు.  ఆ స్వామిజి వెనుక శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం ఉంది, "ఆ దేవదేవునికి మొక్క కుండ, ఈ స్వామికి మొక్కడం ఏమిటి" అని, నా మనసు ప్రశ్న. నాకు తెలీదు.  "అలా చేస్తే ఆ దేవునికి అవమానం కాదా", నోరు మూసుకో, ఇంకో ప్రశ్న అడగకు.  స్వామి గుప్పిళ్ళతో బాదం పప్పులు తీసారు.  తీసి ఒక్కొకరికి ఇస్తూ పోతున్నారు.  భక్తులు తీసుకొని, కళ్ళకు అద్దుకొని, కాళ్ళ మీద పడుతున్నారు.  ఆశ్చర్యం ఏమిటి అంటే , స్వామి  అలా కాళ్ళ మీద పడడం స్వాగతించి, వాళ్ళను దీవిస్తూ పోవడం.  నేను కొంత మంది పూజారులను చూసాను.  పూజ చేయించిన తర్వాత ఎవరినా భక్తులు , పూజారులను దేవుని ప్రతిరూపంగా భావించి పాదాభివందనం చేస్తే, ఆ పూజారి , ఆ నమస్కారాన్ని ఆ దేవునికి అంకితం చెయ్యడం చూసాను. అది వారి అవున్నత్యాన్ని సూచిస్తుంది. మరి స్వామిజి లా విషయం అలా కాదు. వాళ్ళే దేవుళ్ళుగా , భక్తులను ఆశ్వీర్వదిస్తున్నారు.
ఇంతలా స్వామి  టచ్ స్క్రీన్ ఫోన్ మోగింది, ఆ .. ఆ.. వస్తున్నా .. కలుస్తా.. అంటూ మాటలు , ఫోన్ అయిన తర్వాత , మళ్ళే ఆశ్వీర్వాదo .

ఇక చివరి ఘట్టం. స్వామి చిన్న పిల్లలను దగ్గరకు పిలిపించుకొని ముద్దాడడం.  వాళ్ళ తల్లి తండ్రుల మొఖంలో రెండు వెలిగిన బల్బులు.  పిల్లలకు అక్కడున్న బాదాం పప్పులు ఇస్తే తీసుకోలేదు.  అరటిపళ్ళు ఇస్తే తీసుకొన్నారు.  ఇంతలో, స్వామి వారిని పిలిచిన, ఆలయ కమిటి వాళ్ళు, ఒక వెండి పళ్ళెంలో, తాంబూలం, వక్క, అరటిపళ్ళు, రెండు సీల్డు కవర్లు పెట్టి, స్వామికి ఇచ్చారు.  స్వామి,  దూరంగా నిలబడ్డ ఇద్దరు భక్తులను పిలిచి, అరటిపళ్ళతో ఆశ్వీర దించారు. తాంబూలం, వక్క ఒక సోదరికి ఇచ్చారు, ఆవిడ పిల్లడు అందులో అరటి పండు తినేస్తే, ఆవిడ తాంబూలం చప్పరించింది.  స్వామి మాత్రం రెండు సీల్డు కవర్లు, మడిచి బాగ్ లో పెట్టుకొన్నారు. ఎవరు చెప్పక్కరలేదు అవి దక్షిణ అని.

నాకు ఆది శంకరాచార్య ఒక్క సారి గుర్తుకు వచ్చారు.  ఆయన  ఎలాంటి పల్లకిల్ల్లో తిరగలేదు, ఎలాంటి సేవలు చేయించుకోలేదు , ఒకసారి ఆయన భిక్షకు వెళితే , ఒక స్త్రీ దగ్గర  ఏమి భిక్ష లేక పొతే, మీ ఇంట్లో ఏది వుంటే అది ఇవ్వు అమ్మ తీసుకొంటాను అన్నారు. ఆవిడ ఇల్లంతా వెతికి ఒక్క ఎండి పోయిన ఉసిరికాయ ఉంటే , అదే భిక్షగా వేసింది.  ఆ మహాత్ముడు, ఆది గురువు చలించి పోయి,  కనక ధర స్త్రోత్రం చేస్తే,  ఇల్లంతా బంగారు ఉసిరికాయలు రాలాయి.  ఇప్పటికి కనక ధర స్త్రోత్రం చేస్తే, ఇంచు మించు అలాంటి ఫలితమే కలుగుతుంది అని నమ్మకం.  అలాంటి గురువులు తిరిగిన నేల మనది. ఇప్పటి స్వాములకు AC కార్లు,  నడుం నొప్పెట్ట కుండ చక్కటి ఆసనాలు, కాళ్ళకింద మెత్తటి తలగడాలు, ఆశ్వీర్వాది౦చ డానికి బాదాం పప్పులు .
తను కొన్ని వందల కోరాడ దెబ్బలు తిని, శ్రీ రాముడికి గుడి కట్టించిన రామ దాసు ఎక్కడ, ఇచ్చిన దక్షిణ పంచలో కుక్కుకొని  పలాయనం చిత్తగించే స్వామిజి లు ఎక్కడ?   స్వామి ఇంకా అమెరికా అంత పర్యతిస్తారంట!.   ఇవ్వన్ని చూసి అనిపించింది, నేను కూడా స్వామిజి ఎందుకు కాకూడదు?  అసలు ఈ సృష్టిలో స్వామిజి కన్నా మించిన ఉద్యోగం , క్షమించాలి, సమాజ సేవ, కాదుకాదు, ప్రజా సేవ, అయ్యో నామతి మండ, నాకు సరైన పదమే గుర్తుకు రావడం లేదు, సరే ఏదోటి కానీ, స్వామిజి అయితే బాగుంటుంది కదా. 

4 comments:

  1. మీరు స్వామీజీ ఐతే నేను మీ సెగ్రట్రీ అవ్వమని నా మనసు ఒకటే తోస్తోంది. నా అర్ధనిమీలితనేత్రాలు కూడా అదేమిటో ధారాపాతంగా కారిపోతున్నాయి కూడా. మీరు స్వామీజీ అవ్వాల్సిందే! :P

    ReplyDelete
  2. "...ఇప్పటికి కనక ధర స్త్రోత్రం చేస్తే, ఇంచు మించు అలాంటి ఫలితమే కలుగుతుంది అని నమ్మకం..."
    అయ్యా, ఆది శంకరాచార్యుల వారి కాలంలో కార్లు, ఏసీలు లేవు.. ఏం చేస్తాం? అయినా, మంత్రాలకు ఉసిరికాయలు రాలుతాయంటారా?

    ReplyDelete
  3. నాగన్న గారు,

    కార్లు, AC అనేవి సౌకర్యాన్ని సూచిస్తాయి. సౌకర్యాలు ప్రతి కాలంలో ఉన్నాయి, పేర్లు మాత్రం వేరు. ఆ కాలంలో మనుషులు మోసే పల్లకీలు ఉన్నాయి, ఇంకా గుర్రపుబళ్లు వంటివి మనకు తెలిసినవే. ముక్షమైన విషయం ఏమిటంటే, ఆ సౌకర్యాలని ఉపయోగించుకోని స్వాముల వ్యక్తిత్వం. తిరుపతి కొండ AC కార్లో వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. నడిచి వెళ్ళే భక్తునికి కలిగే పారవశ్యం , AC కార్లో వెళ్ళే వాళ్ళకు కలుగు తుందా? ఈ ఇద్దరు భక్తులు మాట్లాడాల్సి వస్తే, మీరు ఎవరి అనుభవాలు వినడానికి సుముఖంగా ఉంటారు?


    ఇక మంత్రాలు అంటే, మంత్రాలు లేని దెక్కడ? ఈ దేవుని పూజ ఇన మంత్రాలు లేకుండా జరుగుతుందా? పెళ్లి కి, గృహప్రవేశానికి , ఆ మాటకొస్తే ప్రతి ఒక్క హిందూ కార్యానికి మంత్రాలు అవసరమే కదా. మంత్రాలకు ఫలితం లేనప్పుడు, వాటిని ఉపయోగించడం అవసరమే లేదు. కాబట్టి మంత్రం లేక పొతే హిందూ సమాజమే లేదు.

    ReplyDelete
  4. Intagaa manchi chedulu aalochistunnaaru- meeku swaamiji ayye chance emaatram ledu sumandi!

    cheers
    zilebi
    http://www.varudhini.tk

    ReplyDelete